కరోనా వైరస్ కారణంగా వూహాన్లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిరిండియా సంస్థ ప్రత్యేక బోయింగ్ విమానం ‘అజంతా’లో శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ఢిల్లీకి తరలించింది. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత 324 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం ల్యాండ్ అయింది. వూహాన్ నగరం నుంచి వచ్చిన వారిని ఢిల్లీలోని మానేసర్, ఛావల్ క్యాంపుల్లోని ప్రత్యేక కేంద్రాలకు తరలించారు. వారిని రెండు వారాల పాటు వైద్యాధికారుల పరిశీలనలో వైద్యపరీక్షలు చేసిన తర్వాత ఇళ్లకు పంపిస్తామని కేంద్ర వైద్యాధికారులు చెప్పారు. ఈ వైద్య శిబిరాలను భారత సైనిక వైద్యశాఖ ఏర్పాటు చేసింది. కరోనావైరస్ రోగుల కోసం ప్రత్యేకంగా ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
వూహాన్ నుంచి తరలిస్తున్న భారతీయులను.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాక నేరుగా వారివారి స్వస్థలాలకు వెళ్లనీయకుండా ఐసోలేషన్ వైద్యకేంద్రాలకు తరలించారు.కరోనా వైరస్ కు కేంద్రస్థానమైన వూహాన్ నగరం నుంచి వస్తున్న నేపథ్యంలో వారిని క్వారంటైన్లలో ఉంచారు. వారి కోసం భారత సైన్యం ఢిల్లీకి సమీపంలోని మనేసర్లో ఒక క్వారంటైన్ను నిర్మించారు. అక్కడ వారిని రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ప్రత్యేక విమానంలో వచ్చినవారందరికీ తొలుత విమానాశ్రయంలోనే పరీక్షలు చేశారు. ఎవరికైనా వైరస్ సోకిందన్న అనుమానం కలిగితే వారిని ఢిల్లీ కంటోన్మెంట్ బేస్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు.